రిలీజ్‌కు ముందే బాలయ్య మేనియా.. రికార్డు ధరకు 'అఖండ-2' రైట్స్

  • బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ-2
  • రికార్డు స్థాయిలో జరుగుతున్న ప్రీ-రిలీజ్ బిజినెస్
  • డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ-2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదల కాకముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఏరియాల థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

తాజా సమాచారం ప్రకారం, ఉత్తరాంధ్ర హక్కులను గాయత్రీ దేవి ఫిల్మ్స్ అధినేత సతీశ్ రూ. 13.50 కోట్లకు దక్కించుకున్నారు. గుంటూరు హక్కులను రూ. 9.50 కోట్లకు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, తూర్పు గోదావరి రైట్స్‌ను రూ. 8.25 కోట్లకు విజయలక్ష్మి సినిమాస్ సొంతం చేసుకున్నాయి. అలాగే, కృష్ణా జిల్లా రూ. 7 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 6.5 కోట్లు, నెల్లూరు రూ. 4.4 కోట్లు పలికినట్లు తెలుస్తోంది.

ఇక, సీడెడ్ ఏరియా హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శోభన్ ఏకంగా రూ. 24 కోట్లకు కొనుగోలు చేశారు. మరోవైపు, నైజాం ఏరియా రైట్స్ కోసం నిర్మాతలు రూ. 30 కోట్లు కోట్ చేస్తున్నారని, ఈ హక్కులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతికి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. షూటింగ్, డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Nandamuri Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Tollywood
Telugu cinema
Pre release business
Dil Raju
Samyuktha Menon
Pragya Jaiswal
Gayatri Devi Films

More Telugu News